పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక – మొదటి నెల 05 రోజు

పరిశుద్ధ గ్రంథ పఠన ప్రణాళిక =  బైబిల్ క్యాలెండర్ మొదటి నెల /05

ఆదికాండము 3:1-19

దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే, తోట మధ్యవున్న చెట్టు ఫలములను గూర్చి, దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై, దేవతలవలె ఉందురనియు, దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు, ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని, తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను. అప్పుడు, వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలిసికొని, అంజూరపు ఆకులు కుట్టి, తమకు కచ్చడములను చేసికొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు, తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు, దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిననెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే, ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా, స్త్రీతో, నీవు చేసినది యేమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున, పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించ బడినదానివై నీ కడుపుతో ప్రాకుచు, నీవు బ్రదుకు దినములన్ని మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును, ఆమె సంతానమునకును, వైరము కలుగజేసెదను. అది (ఆయన) నిన్ను తలమీద కొట్టును. నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను.  ఆయన ఆదాముతో, నీవు నీ భార్యమాట విని, తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక, నీ నిమిత్తము నేల శపింపబడియున్నది.  ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినము లన్నియు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను, గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరువరకు, నీ ముఖపు చెమట కార్చి, ఆహారము తిందువు. ఏలయనగా, నేలనుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.

 

కీర్తనలు 34:1-22 [ప్రధాన గాయకునికి – దావీదు కీర్తన]

దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు. అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని, యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను. వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలుచేయు వారెవరును లేరు. ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు, నా ప్రజలను మింగుచు, పాపము చేయువారికందరికిని తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా, దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు. బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను, యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు. సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును. ఇశ్రాయేలు సంతోషించును.

 

 

Leave a Comment